కాంగ్రెస్ లో యువతకు పెద్దపీట..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
బిఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరిన రహమత్ నగర్ యువత
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ కేసరి, యాదాద్రి భువనగిరి, నవంబర్ 06
కాంగ్రెస్ పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని, యువత భవిష్యత్పై పార్టీ భరోసా కల్పిస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.జూబ్లీహిల్స్ నియెజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా రహమత్ డివిజన్ పరిధిలోని ఇందిర నగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించి, హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.అనంతరం బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు శివ (స్వామి) 100 మంది యువకులు గురువారం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి రహమత్ నగర్ డివిజన్ ఇంచార్జీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు ఇందిరమ్మ ఇల్లు, ఆ ఇంటికి విద్యుత్ వెలుగులు వచ్చాయని చెప్పారు.ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ వెళ్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డు అందజేసిన ఘనత తమదేనని చెప్పుకొచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి సన్న బియ్యం స్కీం అమలు అవుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని,ప్రజలు కాంగ్రెస్ పాలనపై సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అన్ని కులాలను, మతాలను సమానంగా చూసే పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమే అన్నారు.బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.