గంజాయి అక్రమ రవాణా నిందితులపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు
ప్రభుత్వ నిషేధిత గంజాయి కేసుల్లోని నిందితుడు సపావత్ వెంకన్నపై పీడియాక్ట్ నమోదు చేసిన ఇల్లందు పోలీసులు
తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ అక్టోబర్ 26
నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులలో నిందితుడిగా ఉన్న సపావత్ వెంకన్న అనే వ్యక్తిపై ఇల్లందు పోలీసులు పీడియాక్టును నమోదు చేయడం జరిగింది.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనల మేరకు ఇల్లందు డిఎస్పీ చంద్రభాను సలహాలతో ఇల్లందు సీఐ సురేష్ కాశీరామ్ తండా,కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లాకు చెందిన నిందితుడు వెంకన్నపై పీడియాక్ట్ నమోదుకై ఉన్నతాధికారులకు తగిన పత్రాలను సమర్పించారు. అక్రమార్జనే ధ్యేయంగా అలవాటుగా నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నిందితుడు వెంకన్నపై ఇల్లందు, భద్రాచలం, హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ల లో కేసులు నమోదు చేయడం జరిగింది. తనపై ఉన్న కేసులలో ఖమ్మం సబ్ జైలులో ఉన్న నిందితుడిపై పీడియాక్టును అమలు చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఉన్నతాధికారుల నుండి పీడియాక్ట్ ఉత్తర్వుల కాపీనీ అందుకున్న ఇల్లందు సీఐ సురేష్ నిందితుడిని చర్లపల్లి జైలుకి తరలించి అక్కడి అధికారుల సమక్షంలో నిందితుడికి అందజేశారు. ఇలాంటి నేరస్తుల వలన ఎంతో మంది యువత మత్తుకు బానిసలై తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అందుకే వీరిపై పీడియాక్ట్ లను నమోదు చడం జరుగుతుందని ఈ సందర్బంగా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.గంజాయి సమూల నిర్మూలన కొరకు జిల్లా పోలీస్ శాఖ తరపున చైతన్యం – డ్రగ్స్ పై యుద్ధం అనే కార్యక్రమాన్ని చేపట్టి అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు,జిల్లా ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అలవాటుగా ఇలాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి, వారిపై కూడా పీడియాక్టులను నమోదు చేయనున్నామని తెలియజేశారు. నిందితుడు సపావత్ వెంకన్నపై పీడి యాక్ట్ నమోదయ్యేలా కృషి చేసిన ఇల్లందు డిఎస్పీ చంద్ర భాను,ఇల్లందు సీఐ సురేష్ మరియు సిబ్బందిని ఈ సందర్బంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.