టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ రద్దు

 

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ రద్దు

డిసెంబర్ లో రాష్ట్ర మహాసభలు

రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ ఏర్పాటు

తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ హైదరాబాద్, నవంబర్ 15

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) తృతీయ మహాసభలు డిసెంబర్ లో జరపాలని ఫెడరేషన్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్ణయించింది. కాలపరిమితి ముగిసినందున ఫెడరేషన్ రాష్ట్ర కమిటీని పూర్తిగా రద్దు చేస్తూ తీర్మానించింది. రాష్ట్ర మహాసభల నిర్వహణకు కన్వీనింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ సమావేశం తీర్మానించింది. శనివారం హైదరాబాద్ లో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, అక్రెడిటేషన్ కమిటీ సభ్యులు, రాష్ట్ర కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య ను సంఘం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఇటీవల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వ్యవస్థాపక సభ్యుల సమావేశం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. అదేవిధంగా 2025-27 సంవత్సరాలకు గాను రాష్ట్ర అధ్యక్షుడి నేతృత్వంలో జరిగిన జిల్లాల మహాసభల్లో ఎన్నికైన జిల్లా కమిటీలు యధావిధిగా కొనసాగించాలని సమావేశం తీర్మానించింది. ఇప్పటివరకు మహాసభలు జరగని జిల్లాల్లో ఉన్న అన్ని పాత కమిటీలను రద్దు చేస్తూ తీర్మానించింది. త్వరలో ఆయా జిల్లాల్లో అడ్ హక్ కమిటీలు వేసి జిల్లా మహాసభలు జరపాలని, నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ స్కీం అమలు చేయాలని, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య, వైద్య సదుపాయం కల్పించాలని, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ స్కీం అమలు చేయాలని సమావేశం విజ్ఞప్తి చేసింది.

 

బసవ పున్నయ్య తొలగింపుకు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఆమోదం

 

ఫెడరేషన్ ను విచ్చిన్నం చేసి నవతెలంగాణలో పనిచేస్తున్న జర్నలిస్టులను, రాష్ట్ర నాయకులను, ఫెడరేషన్ సభ్యులను తప్పుదారి పట్టిస్తూ సంఘానికి సంబంధించిన లెక్కలు చెప్పకుండా సంఘం యొక్క కార్యక్రమాలు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన బసవ పున్నయ్యను తొలగిస్తూ రాష్ట్ర అత్యవసర సమావేశం చేసిన తీర్మానాన్ని ఈ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన సభ్యత్వ రుసుము లెక్కలు చెప్పకుండా, డైరీ, మ్యాగజిన్ ద్వారా ఫెడరేషన్ కు వచ్చిన ఆదాయం లెక్కలు చూపకుండా, జిల్లాల మహాసభలు జరపకుండా అడ్డుకుంటూ, సంఘాన్ని విచ్చినం చేసిన అతన్ని ఫెడరేషన్ నుండి శాశ్వతంగా బహిష్కరించడాన్ని సభ్యులందరూ విస్త్రృతస్థాయి ఏకగ్రీవంగా ఆమోదించారు. బహిష్కరణకు గురైన బసవ పున్నయ్య కు ఇక నుంచి టీడబ్ల్యూజేఎఫ్ కు ఎలాంటి సంబంధం లేదని సమావేశం స్పష్టం చేసింది. ఫెడరేషన్ పేరుతో ఎలాంటి కార్యక్రమాలు, కార్యకలాపాలు నిర్వహించరాదని సమావేశం తీర్మానించింది. ఈ విషయాన్ని జర్నలిస్టులు, ఫెడరేషన్ శ్రేయోభిలాషులు గ్రహించాలని విజ్ఞప్తి చేసింది. టీడబ్ల్యూజేఎఫ్ పేరుతో ఆయన కార్యక్రమాలు చేస్తే… అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే బాధ్యతలను రాష్ట్ర కన్వీనింగ్ కమిటీకి అప్పగించింది.

రాష్ట్ర మహాసభల కన్వీనింగ్ కమిటీ ఏర్పాటు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర తృతీయ మహాసభల నిర్వహణ,ఇతర కార్యక్రమాల నిర్వహణకు ఎనిమిది మందితో రాష్ట్ర కన్వీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కన్వీనర్ గా మామిడి సోమయ్య, కో- కన్వీనర్లుగా పులిపలుపుల ఆనందం, బండి విజయ్ కుమార్, ఎం. యాదగిరి, వల్లాల జగన్, ఆర్.వెంకటేశ్వర్లు, తన్నీరు శ్రీనివాస్, కుడితాడు బాపురావు, కర్ర అనిల్ రెడ్డి, గుండెబోయిన వెంకటేశ్వర్లు ఉన్నారు. అదేవిధంగా సంఘం జాతీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ గా సీనియర్ జర్నలిస్టు కూసం సారంగపాణిని సమావేశం నియమించింది.

 

 

WhatsApp Join Now
Youtube Subscribe